భారత్-పాక్ వివాదంలో ట్రంప్ జోక్యంపై శరద్ పవార్ తీవ్ర అభ్యంతరం

  • భారత్-పాక్ మధ్య ట్రంప్ మధ్యవర్తిత్వమా? అంటూ పవార్ ఫైర్
  • ఇది సిమ్లా ఒప్పందానికి విరుద్ధమని వెల్లడి
  • కాల్పుల విరమణను ట్రంప్ ప్రకటించడం సరైన చర్య కాదన్న ఎన్సీపీ అధినేత
భారత్, పాకిస్థాన్ మధ్య వివాదాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం నెరపడాన్ని తాను ఎంతమాత్రం ఆమోదించడం లేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్ర పవార్ వర్గం) అధ్యక్షుడు, కేంద్ర మాజీ రక్షణ మంత్రి శరద్ పవార్ స్పష్టం చేశారు. సిమ్లా ఒప్పందం ప్రకారం, ఇరు దేశాల మధ్య వివాదాల్లో మూడో పక్షం జోక్యానికి తావులేదని ఆయన ఉద్ఘాటించారు.

సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, "పాకిస్థాన్ నాటి అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో, భారత నాటి ప్రధాని ఇందిరా గాంధీ మధ్య సిమ్లా ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం మూడో పక్షం జోక్యాన్ని స్పష్టంగా తిరస్కరించింది. ఒప్పందం ప్రకారం, రెండు దేశాలు తమ సమస్యలను మూడో పక్షం మధ్యవర్తిత్వం లేకుండా పరిష్కరించుకోవాలి. అలాంటప్పుడు ఇతరులు ఎందుకు తలదూర్చాలి?" అని పవార్ ప్రశ్నించారు. అమెరికా అధ్యక్షుడు భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ గురించి 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఏకపక్షంగా ప్రకటించడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. "ఒక అమెరికన్ నేత బహిరంగంగా ముందుకు వచ్చి ఇలాంటి ప్రకటన చేయడం ఇదే ప్రథమం. ఇది సరైన పద్ధతి కాదు" అని పవార్ అన్నారు.

 'ఆపరేషన్ సిందూర్', తదనంతర పరిణామాల నేపథ్యంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలన్న డిమాండ్ పై స్పందిస్తూ, "పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించడంపై మాకేమీ అభ్యంతరం లేదు. కానీ, ఈ తరుణంలో ప్రభుత్వం ఎంత వరకు సమాచారం బహిర్గతం చేస్తుందో చెప్పలేం. రక్షణకు సంబంధించిన అనేక కీలక వివరాలను పంచుకోలేరు, కాబట్టి వాటిని గోప్యంగా ఉంచాల్సి ఉంటుంది. ఒకవేళ సమావేశం ఏర్పాటు చేయాలనుకుంటే చేయవచ్చు. దానికి బదులుగా, అఖిలపక్ష నేతల సమావేశం ఏర్పాటు చేసి, సమాచారం పంచుకోవాలి. ప్రస్తుత పరిస్థితి (కాల్పుల విరమణ అనంతరం), భారత్ తీసుకున్న చర్యల గురించి వివరించడానికి రక్షణ శాఖ అధికారులను ఆహ్వానించాలి" అని పవార్ అభిప్రాయపడ్డారు.

ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న విషయాన్ని విలేకరులకు గుర్తుచేస్తూ, "మీరు (పత్రికలు, మీడియా ప్రతినిధులు) వినండి, నేను కూడా వింటాను, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. అయితే, అమెరికా జోక్యం గురించిన సమాచారం మాత్రం ఇవ్వాలి" అని పవార్ పేర్కొన్నారు.

కాల్పుల విరమణ ప్రకటన వెలువడిన అనంతరం తన స్పందనను తెలియజేస్తూ, భారత్ ఎన్నడూ ఉగ్రవాదాన్ని సమర్థించలేదని పవార్ పునరుద్ఘాటించారు. "ఆపరేషన్ సిందూర్ ద్వారా, భారత్ ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే కఠినమైన, కచ్చితమైన చర్యలు తీసుకుంది. పాకిస్థాన్ సైనిక స్థావరాలపై గానీ, పౌరులపై గానీ దాడి చేయాలనే ఉద్దేశం లేదు. దేశ భద్రతకు ఈ సైనిక చర్య తప్పనిసరి అయింది" అని పవార్ వివరించారు.

"పాకిస్థాన్ నుంచి నిరంతరంగా ఎదురవుతున్న కవ్వింపులకు సంయమనంతో, నిర్ణయాత్మకంగా స్పందించాల్సిన బాధ్యత భారత్‌పై ఉంది. ప్రపంచ శాంతి స్ఫూర్తితో భారత్ ఆ పని చేసింది. భారత్ ఎల్లప్పుడూ శాంతి, చర్చలకు మద్దతునిస్తుంది. ఆ దిశగా ఏవైనా సానుకూల పరిణామాలు చోటుచేసుకుంటే స్వాగతించదగినవే" అని పవార్ తెలిపారు. "అయితే, ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవడం అంతర్జాతీయ సమాజం సమష్టి బాధ్యత కూడా. శాంతి దిశగా వేసే ప్రతి అడుగు ఉగ్రవాదంపై సామూహిక పోరాట బలాన్ని ఇనుమడింపజేస్తుంది" అని ఆయన జోడించారు.

Sharad Pawar
India-Pakistan Conflict
Donald Trump
Simla Agreement
Operation Sundar
Indo-Pak ceasefire
US Intervention
International Relations
Nationalist Congress Party

More Telugu News